కొన్నేళ్ల వ్యవధిలోనే చైనా టెక్నాలజీ సంస్థ షియోమి భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించే స్థాయికి చేరుకుంది. 'చౌక ఫోన్లు, మెరుగైన ఫీచర్లు' అంటూ భారత మార్కెట్‌లో శరవేగంగా దూసుకెళ్లిన ఈ సంస్థ ప్రయాణం గురించి తెలుసుకునేందుకు బీబీసీ ప్రతినిధి కృతికా పతి, టెక్నాలజీ మార్కెట్ విశ్లేషకులతో మాట్లాడారు.
'ఫ్లాష్ సేల్స్' పేరుతో నిమిషాల వ్యవధిలో అనేక ఫోన్లను ఆన్‌లైన్‌లో అమ్మేస్తోంది షియోమి. తాజాగా సోమవారం రెడ్‌మీ నోట్ 8 మోడల్ ఫోన్లు 15 నిమిషాలలోనే అమ్ముడుపోయాయి.
ఆఫ్‌లైన్ దుకాణాల్లోనూ షియోమి ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, కొత్త మోడల్ ఫోన్లను తొలుత ఆన్‌లైన్‌లోనే అమ్ముతోంది ఈ సంస్థ. అందుకే, దీని అమ్మకాలలో సగానికి పైగా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి.
"షియోమి బ్రాండ్ ఫోన్లకు ఆన్‌లైన్‌లో అద్భుతమైన ఆదరణ లభిస్తోంది" అని టెలికం పరిశోధనా సంస్థ కన్వర్జెన్స్ క్యాటలిస్ట్ భాగస్వామి జయంత్ కోళ్ల అన్నారు.
2015లో భారత మార్కెట్లో షియోమి అడుగు పెట్టినప్పుడు, ఆఫ్‌లైన్ దుకాణాలను ఏర్పాటు చేయలేదు. తన ఉత్పత్తులను నేరుగా ఆన్‌లైన్‌లో అమ్మడంపైనే దృష్టి పెట్టింది. దాంతో దుకాణాల నిర్వహణ, పంపిణీ ఖర్చులు తగ్గడంతో ఫోన్‌లు చౌక అయ్యాయి.
"ఆరంభం నుంచే ఆన్‌లైన్‌లో ఆదరణ సంపాదించడంతో దేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీదారుగా నిలబడేందుకు షియోమికి సులువైంది" అని జయంత్ అంటున్నారు.
ప్రస్తుతం వేగంగా వృద్ధి చెందుతున్న భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్, సగానికి పైగా చైనా కంపెనీల నియంత్రణలో ఉంది. ఆ సంస్థలకు ఇక్కడ 45 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు.
"పేదల ఐఫోన్"
"ఒకప్పుడు "పేదల ఐఫోన్"గా పేరు తెచ్చుకున్న షియోమికి ప్రస్తుతం భారత మార్కెట్లో 28 శాతం వాటా ఉంది. 2016లో మూడు శాతం మాత్రమే ఉండేది. ఐఫోన్‌ మాదిరి డిజైన్‌తో ఫోన్‌లను తీసుకురావడంతో షియోమి ఫోన్లకు 'పేదల ఐఫోన్' అన్న పేరు ప్రచారంలోకి వచ్చింది. అందుకు ఆ సంస్థ విమర్శలు కూడా ఎదుర్కొంది" అని భార్గవ చెప్పారు.
షియోమి ఫోన్లు ఐఫోన్‌ మాదిరిగా కనిపించడమే కాదు, ఐఫోన్లలో ఉండే పలు ఫీచర్లను, హార్డ్‌వేర్‌లను కూడా అందించింది. ఐఫోన్‌ ధరలో మూడో వంతు ధరకే ఈ ఫోన్లు దొరుకుతున్నాయి. దాంతో తక్కువ ధరకే మెరుగైన ఫోన్ వస్తోందన్న భావన ఏర్పడింది.
ఉదాహరణకు రెడ్‌మి శ్రేణి ఫోన్లను చూస్తే, 64 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్లు రూ. 9,999 నుంచి రూ.17,999 లోపే దొరుకుతున్నాయి.
"అందరూ ఐఫోన్‌ కావాలని కోరుకుంటారు, కానీ దానిని కొనేందుకు ఆర్థిక స్తోమత సరిపోదు. అప్పుడు, తమ కొనుగోలు శక్తి పెరిగే దాకా ఐఫోన్‌ను పోలిన ఇలాంటి ఫోన్లతో సరిపెట్టుకుంటారు" అని జయంత్ వివరించారు.
భారతీయ వినియోగదారులు తరచూ "ఖరీదైన స్మార్ట్‌ఫోన్"కు అప్‌గ్రేడ్ అవుతున్నారని తమ సంస్థ చేసిన పరిశోధనలో తేలిందని ఆయన చెప్పారు. చాలామంది ఆదాయం పెరిగిన వెంటనే యాపిల్ లేదా శాంసంగ్ లాంటి ఫోన్లను కొంటున్నారని తెలిపారు.
దేశీయ బ్రాండ్లకు 4జీ దెబ్బ
4జీ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో వెనకబడటంతో భారత స్వదేశీ మొబైల్ బ్రాండ్లు నెమ్మదిగా పతనమయ్యాయి. షియోమి వాటా పెరగడానికి అది కూడా ఒక కారణమని చెప్పొచ్చు.
"ఒకప్పుడు మైక్రోమాక్స్‌ లాంటి స్వదేశీ బ్రాండ్లు దేశీయ మార్కెట్‌లో ముందుండేవి. కానీ, భారత్‌లో 4జీ ప్రవేశపెట్టిన తర్వాత 2016, 2017లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది" అని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థకు చెందిన టెక్నాలజీ విశ్లేషకుడు నెయిల్ షా చెప్పారు.
"భారత్‌లో 4జీ అందుబాటులోకి వచ్చే నాటికే, చైనా కంపెనీలు 4జీ సదుపాయం ఉన్న చౌక ఫోన్లను విజయవంతంగా తయారు చేయగలిగాయి. దాంతో భారత మార్కెట్‌లోకి శరవేగంగా ఆ ఫోన్లను ప్రవేశపెట్టగలిగాయి. చూస్తుండగానే అనేక మంది 3జీ నుంచి 4జీ ఫోన్లకు మారిపోయారు. ఫలితంగా భారతీయ బ్రాండ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి" అని షా వివరించారు.
అయితే, భారత పోటీ మార్కెట్‌లో ఏ సంస్థ కూడా సుదీర్ఘకాలం పాటు ఆధిపత్యం కొనసాగించలేదు అన్నది వాస్తవం.
మార్కెట్‌లో 28 శాతంగా ఉన్న షియోమి వాటా గత ఏడాది నుంచి పెరగడంలేదు. కాబట్టి, దాని వేగం తగ్గిందని అర్థం చేసుకోవచ్చు.
ఇక కొరియా దిగ్గజం శాంసంగ్ కూడా దానికి దగ్గరలో 25 శాతం వాటా కలిగి ఉంది. కొత్తగా రియల్‌మి లాంటి ఇతర చైనా కంపెనీలు కూడా భారత వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.
"కొన్నేళ్ల క్రితం భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రీమియం ఫోన్ల వాటా మూడు నుంచి నాలుగు శాతం ఉండేది. ఇప్పుడు అది పెరిగింది" అని షియోమి ఇండియా డైరెక్టర్ మను జైన్ ఈ ఏడాది జూలైలో ది హిందూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
చౌక ఫోన్లతో పాటు, ప్రీమియం మార్కెట్ మీద కూడా దృష్టి పెట్టామని ఆయన తెలిపారు.
కానీ, రూ.20 వేల నుంచి 30 వేల శ్రేణి షియోమి ఫోన్లు, యాపిల్ ఐఫోన్, శాంసంగ్ గెలాక్సీ ఫోన్లతో పోటీ పడలేకపోతున్నాయి.
ప్రీమియం మార్కెట్‌లో యాపిల్, శాంసంగ్‌లతో పోటీ పడాలంటే అత్యాధునిక ఫీచర్లతో, కొత్త ఉత్పత్తులను తీసుకురావాలని లేదంటే చైనా కంపెనీలు చౌక ఫోన్ల అమ్మకాలకే పరిమితం అవ్వాల్సి వస్తుందని జయంత్ అభిప్రాయపడ్డారు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: